
ఈ మధ్య కాలం లో అసలు మానవత్వం అనేది మిగిలి ఉందా అని అనుమానించే విధంగా మనమంతా ఉంటే, మరి మనం ఎన్నుకున్న నేతలు ఇంకెక్కడి నుంచో పుట్టుకు రాలేదు కదా ? పాపం కోట్లు ఖర్చు పెట్టి సీట్లు కొనుక్కొని, ఇంకెన్నో కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొని, ఎం ఎల్ ఏలు, ఎం పీ లు అయ్యి , నానా తంటాలు పడీ, అడ్డమైన కాళ్ళు పట్టుకొని మంత్రులయ్యేది ఎందుకు ? ఇలా రోడ్డున పోయే దానయ్యలను కాపాడటానికా ? ఎంత వాళ్ళని కాపాడటం కోసమే నియమించబడిన వారైనా, ఇలా వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు కారు దిగి కాపాడాలా ? ఆ బాంబులూ, గుళ్ళూ తగిలి పొతే వాళ్ళు పెట్టిన ఖర్చంతా ఎక్కడినుంచి తిరిగి వస్తుంది ? బ్రతుకుంటే పది స్కామ్స్ చేసుకుని స్విస్ బ్యాంకు కాతాలలో డబ్బు పెంచుకోవచ్చు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు దిగి వాళ్ళను హాస్పిటల్ తీసుకెళ్ళాల్సిన అవసరం ఏముంది ? వాళ్లకు జీతాలు ఇచ్చి పెంచి పోషించేది ఇలా అవసరం అయినప్పుడు చావడానికేగా? అంతే వీళ్ళు ఎం చేస్తారు ఇంకా అంటే , ఖుషీలు చేస్తారు ! ఒకవేళ ఎవ్వరూ పట్టించుకోకపోతే తమ ఉనిఖిని చాటుకోవడం కోసం , అంతగా అయితే ఎవరికీ పట్టని విషయం కోసం పోరాటం సాగిస్తారు, నిరసనలు తెలియచేస్తారు, ఉత్తుత్తి నిరాహార దీక్షలు చేస్తారు, సామాన్య ప్రజానీకాన్ని, చిన్నారులను రెచ్చగొడతారు, డబ్బుకో పనులకో తమమీద ఆశ్రయించుకొని తిరుగుతున్న అనుచరులను ప్రేరేపించి విధ్వంసాలు సృష్టిస్తారు ! పొతే జనం పోతారు ! కాకపొతే పొరబాటున పనైతే జీవితాంతం నేతలుగా బతికేయొచ్చు ! అలాకాకపోతే ఎలాగూ గొడవలు ఆపడం కోసం ఎవరో ఒకరు ఎంతో కొంత ముట్ట చెప్పకపోరు ! అప్పుడు మళ్ళీ శాంతి దూతలు అయిపోతారు !
అందుకే మరి తస్మాత్ జాగ్రత్త ! రాజకీయ నాయకులుంటారు !
మనం కలిసున్నామా విడిపోతామా అని కాదు వాళ్లకు కావాల్సింది, వాళ్ళకెంత ముడుతోందని ! మనం ఎంత మూర్ఖంగా నమ్మితే అంత తియ్యగా మనను ముంచేస్తారు !
అందుకే మరి తస్మాత్ జాగ్రత్త ! రాజకీయ నాయకులుంటారు !