వార్షికోత్సవాలు జరిపితే సరిపోయిందా ?

Friday 27 November 2009

నిన్నటితో మా ముంబాయి నగరం మీద ఆరుగురు పాక్ ఉగ్రవాదులు దాడి జరిపి సంవత్సరం పూర్తి అయ్యింది !
ఆహా ! ప్రతి చోటా ప్రార్థనలు, కార్యక్రమాలు, టీ వీ కవరేజ్ , హంగామా హడావుడి ! ఒక చోటైతే రెండు పార్టీలు వేరు వేరుగా సమావేశాలు నిర్వహించి పిలిచేసరికి, ఏ సమావేశానికి వెళ్తే భద్రమో తెలియక పాపం ఆ ఏరియా లోని పౌరులు ఇబ్బంది పడిపోయారు !తెల్లారేసరికి అంతా మళ్ళీ అదే నిశ్శబ్దం ! నిన్న ప్రత్యెక రక్షక దళం ఫ్లాగ్ మార్చ్ చేసింది ! కొత్త ఆర్మర్డ్ వాహనాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ప్రదర్శిస్తూ వాళ్లు వెళ్ళారు ట్రిడెంట్ హోటల్ చౌపాటీ వరకూ ! ట్రిడెంట్ హోటల్ పై నుంచి రోడ్డుకు అటువేపు ఉన్న ఎయిర్ ఇండియా భవనం పై అంతస్తు వరకూ వైర్లు కట్టి మేము జనాలను ఈవిధంగా కాపాడగలం అని వాళ్లు చెప్పాలని చేసిన ప్రయత్నం హాస్యాస్పదంగా ఉండింది ! ఈ చిన్ని ప్రయత్నం కోసం వాళ్లు రెండు రోజుల నుంచీ ఎంతో భందో బస్తు తోనూ, మొత్తం మేరిన్ డ్రైవ్ మీదకు వాహనాలను అనుమతించకుండా ఉండగలగటం తోనూ ఏదో తిప్పలు పడ్డా, అకస్మాత్తు దాడులను ఎలా ఎదురుకుంటారో ఏవిధంగానూ చెప్పలేకపోయారు ! ఇప్పటికీ ఈ వీధులన్నీ అంతే అభద్రంగా ఉన్నాయన్నది నిత్యం మేము చూస్తున్న సత్యం ! సముద్ర మార్గాన్ని పహారా కాయడానికి ఇంకా పూర్తి గా కోస్ట్ గార్డ్లకు సరైన పడవలు ఇవ్వలేకపోయారన్నది జగమెరిగిన సత్యం ! ఆరోజు పోలీసు వ్యవస్థ పూర్తిగా పక్షవాతం వచ్చిన రోగిలా ఫ్రీజ్ అయిపోయిన్దనేది ప్రతి ముంబై పౌరుడూ మరిచిపోలేని నిజం ! ఇప్పుడు అటువంటి అవసరం మా ఖర్మగాలి మళ్ళీ వస్తే వాటిని ఎలా ఎదుర్కో బోతున్నారో, ప్రతి పౌరుడూ అప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలో, ఎలా వ్యవహరించాలో ఏమైనా ప్రణాళిక చేసారన్న సూచనలే లేవు ! ఆ సమయం లో హోం మంత్రిగా పనిచేసిన పాటిల్ గారిని అప్పుడు ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చిందో మరిచిపోయి మళ్ళీ హోం మంత్రిగా చేసి చేతులు దులిపేసుకున్నారు ! చనిపోయినవాళ్ళకు, గాయపడిన వాళ్ళకూ పరిహారం ఇవ్వడం ఒక్కటే చేసేట్లయితే ప్రభుత్వం ఎందుకూ ? అది కూడా అందరికీ సరిగా ముట్టలేదని చెబితే అద్వానీని రాజకీయం చేస్తున్నావని నోరు పారేసుకుంటారు పాపం లోక్ సభలో !

మన దేశం లో సగటు పౌరుడికి సమాధానం చెప్పే తీరిక ఈ రాజకీయ నాయకులకు కానీ, ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ యంత్రాంగానికి కానీ, సంభందిత అధికారులకు కానీ ఉన్నట్లు కనపడదు ! ఇదివరకు రోజుల్లో చెప్పినట్లు వ్యాధి వచ్చినాక మందులు వాడటం కన్నా వ్యాధినివారణ మంచిదనే మాట దెస భద్రతకూ అన్వయిస్తుంది ! అయిపోయిన వాటిని రంగులద్ది చూపించదమూ, సుదీర్ఘ చర్చలు చేయడం తప్ప నివారణకోసం చర్యలు ఎవరూ చేపట్టడం లేదు ! మీడియా కు కూడా ఇలాంటి సందర్భాలు వారి టీ ఆర్ పీ రేటింగులను పెంచుకునే మార్గంగా ఉపయోగపడుతున్నాయే కనీ సరైన దిశా నిర్దేశం కావటల్లేదు !

ఇంటినుంచి బయటకు వచ్చిన వారు మళ్ళీ ఇంటికెళ్ళే లోపు ఇంకో 26 / 11 , లేకపోతె ఇంకో గోకుల్చాట్,లుమ్భినీపర్క్ జంట పేలుళ్లు, ఇంకో మాలెగావ్ లాంటి సంఘటనలు జరక్కుండా వచ్చారంటే అది వాళ్ల అదృష్టమే కానీ మన ప్రభుత్వాల గొప్పదనం కాదని మళ్ళీ, మళ్ళీ తేలిపోతోంది !

ఇప్పటివరకూ ఇలాంటి విద్రోహ కాండలలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులు అర్పించడం కన్నా ఇంకేమీ చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాను !

ఊరుకోమ్మా ఇంద ఇవి తీసుకోలే !

Tuesday 17 November 2009

ఇది కొత్త ఫ్యాషన్ తెలుసా ?

Tuesday 27 October 2009

ఈ పేటకు నేనే మేస్త్రీ !

పీ వీ నరసింహా రావు ఎక్స్ ప్రెస్ వే మీద మొదటి ప్రయాణం

Tuesday 20 October 2009

ఎప్పుడెప్పుడా అని భాగ్యనగరవాసులందరూ ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది ! పీ వీ ఎన్ ఆర్ ఎక్స్ ప్రెస్ వే మొత్తానికి నిన్న రోసయ్యగారి హస్తాలమీదుగా జాతికి అంకితం చేయబడింది ! ఆరు వందల కోట్ల రూపాయల ఖర్చుతో 11.66 కి మీ పొడవుతో దర్జాగా దేశం మొత్తం మీద అతి పొడవైన ఫ్లై ఓవర్ గా పేరు మ్రోగించుకొంటూ ప్రయాణికులను ఆహ్వానించింది !
ఈ రోజు ఉదయమే ముంబైకి బయలుదేరిన నేను ఎంతో సంతోషించాను ! ఆహా తొలిసారి ఈ ఎక్స్ ప్రెస్ వే ను వాడుతున్నాను ఏమి నా భాగ్యమూ అని బయలు దేరాను ఏరో ఎక్స్ ప్రెస్ లో !
ద్విచక్ర, త్రి చక్ర వాహనాలనూ, రిక్షా, లారీ లేక ట్రాక్టర్ లను , పాద చారులను దీనిమీడకు రానిచ్చేది లేదని ముందు నుంచీ డంకా బజాయించి చెబుతున్న ప్రభుత్వపు మాటలను ప్రజలు మన్నిన్చేట్లు చేయడానికి బ్రిడ్జి మొదట్లో ఎవరైనా ఉంటారేమో అని చూస్తె పాపం ఎవ్వరూ లేరు ! దానికి తగ్గట్లు గానే ఈ ఎక్స్ ప్రెస్ వే పై నుంచి నగర అందాలను చిత్రభద్దమ్ చేయడానికి కొందరు పాదచారులు ప్రయత్నిస్తూ కనిపించారు ! ఇంకా కొత్త బ్రిడ్జి కాబట్టి సరిగా అవగాహన లేక వాహనాలు తక్కువ వేగం తో వెళుతున్నాయి కాబట్టి సరిపోయింది కానీ, లేకపోతె వారి పరిస్తితి వారి వల్ల వాహన చాలకుల పరిస్థితీ తలుచుకుంటే వళ్ళు గగుర్పొడుస్తుంది !
ఏరో ఎక్స్ ప్రెస్ బస్లో కూర్చొని చూస్తుంటే ఉదయాన్నే పూర్తి దృశ్యం సరిగా కనిపించలేదు కానీ కంటోన్మెంట్ దగ్గర పెరిగిన చెట్లు చక్కటి అనుభూతిని ఇచ్చాయి ! హైదరగూడా దగ్గర లోయలోకి చూస్తున్నట్లు అనుభూతి కూడా బానే ఉంది !
ఈ అనుభూతులకు తూట్లు పొడుస్తూ బ్రిడ్జి మీద తక్కువ వేగంలో కూడా ఎగిరెగిరి పడుతున్న వాహనాలు, కింద రోడ్డు ఎన్ని వంకరలు ఉంటే అన్ని వంకరలతోనూ, ఎన్ని ఎత్తుపల్లాలు ఉంటే అన్ని ఎత్తుపల్లాలతోనూ, స్తంబాలను బ్రిడ్జి మీద గతుకులులా అనిపించనివ్వకుండా, ఒకే లెవెల్ లో ఉంచి తిన్నగా రోడ్డు వేయడం అంత కష్టమైన పనా ? , రెండు చోట్ల స్పీడు బ్రేకర్లతో అక్కడ సన్నగా మారి ఇంకా నిర్మాణం పూర్తికాలేదని చెప్పక చెబుతున్న బ్రిడ్జీ భవిష్యత్తులో ఈ రెండు చోట్లా ఒకవేళ ట్రాఫిక్ వచ్చి జాంలు ఏర్పడితే చాలా ఇబ్బంది కరం కావొచ్చని హెచ్చరిక చేసింది !

ఎవరో ఇది ముంబై లో ఈ మధ్యనే ప్రారంభించిన వొర్లి - భాంద్రా సీ రూటు బ్రిడ్జి కన్నా బావుందని ప్రశంసించారు, కానీ అది తిన్నగా ఎటువంటి వంకరాలూ లేకుండా జనావాసాలకు దూరంగా, సముద్రం లో ఉంటే , ఈ బ్రిడ్జి అష్టావక్రంగా, రెండు ప్రక్కలా పెరుగుతున్న కాంక్రీటు అరణ్యం మధ్యలో వెళ్తూ ఉంది ! ఎలా ఉన్నా రెంటి పనీ ఒక్కటే, రద్దీ తగ్గించి సమయాన్ని మిగల్చడం ! దీనికి పెట్టవలసిన శబ్ద కాలుష్యాన్ని తగ్గించే నాయిస్ బ్రేకర్లు పెట్టి బ్రిడ్జి పొడుగూతా ఉన్నా ప్రజల నిద్రను కాపాడుతారని ఆశిస్తాను !
ఒక 15 నిముషాలలో ముగిసిన మొదటి ప్రయాణం ఆనందాన్నీ, ఆందోళన నూ సమ పాళ్ళలో రుచి చూపించింది అచ్చు ఉగాది పచ్చడిలా !




హైదరా 'బాధ' బాటచారులు !

Tuesday 22 September 2009

మన భాగ్య నగరంలో ప్రజలు కాలి నడకన వెళ్ళాలి అంటే అది ఒక నరకమే !రోడు మీద ఎటువైపు నుంచి ఎ వాహనం వస్తుందో తెలీదు ! రోడ్డుకు కుడి చేతి పక్కగా నడుద్దాం అంటే బస్సు స్టాప్ లూ , దాని దగ్గరకు పోలేనంతగా ఆటోలు, తోపుడు బళ్ళూ , పైగా రాంగ్ రూటులో ఎదురొచ్చే సైకిళ్ళూ , స్కూటర్లూ, ఆటో లూ , అప్పుడప్పుడు కార్లూ, లారీలూ కూడా ! ఏయ్ నీకేమైనా పిచ్చా ఫుట్పాత్ మీద నడవకుండా రోడ్డుమీద నడుస్తూ అవడ్డూ, ఇవడ్డూ అంటావే అంటున్నారా ? అయితే మీది హైదరా ' బాధ ' కాదు ! మన మున్సిపాలిటీ పెద్దలు పాపం రోడ్లు వెడల్పు చేస్తారు కానీ ఫుట్పాత్ పెట్టడం మరిచిపోతారు, లేకపోతే పేరుకి బుల్లి గా ఉంచుతారు ! పొరపాటున ఫుట్పాత్ ఉందీ అంటే దాని మీద ట్రాన్స్ ఫార్మర్లు , చెట్లూ వాటి చుట్టూతా కంచెలూ, చెత్త కుప్పలూ, బట్టబయటి సులబ్ లూ !మనకి అవిలేని ప్రదేశం కనిపించిందీ అంటే చక్కగా పూర్తి ఫుట్పాత్ మీద చక్కగా డిస్ప్లే చేస్తూ పళ్ళూ, ఇంకా నానా చెత్తా అమ్మేవాళ్ళు ! ఇంకా విరిగి పోయి పడబోతున్న స్తంబాలూ,తెగిపోయి వేలాడుతున్న తీగెలూ ఇలా వీటన్నిటినీ దాటుకుంటూ గమ్యాన్ని చేరడం అంటే పద్మవ్యూహంలో అడుగు పెట్టినట్లే ! మరి మున్సిపాలిటీ లో పెద్దలు బతికేదీ ఇదే నగరమైన పాపం వాళ్ళు ఈ చెత్త రోడ్లమీద నడవరనుకుంటా ! వాళ్ళు సరే పోలీసులెం చేస్తున్నారూ అంటారా ? భలేవారే మీరు ఇవన్నీ వాళ్ళ ఆదాయ మార్గాలు ! రోజూ బంగారు గుడ్లు పెట్టే బాతులు ! వాళ్ళు ఎలా పట్టించుకుంటారు? ఇంక మనం నోరు తెరిచి అడగాలంటే గూండాలు తయారు మన భరతం పట్టడానికి ! ఎవరిని ఎంత తిట్టి లాభం ఏమిటి ? స్వలాభం తప్ప ఇతరుల పని పట్టని పాలకులనూ, అధికారులనూ, ప్రజలనూ ఎలా తిట్టాలో మీరే చెప్పండి !

వీళ్ళనేనా మనం ఎన్నుకుంది ?

మనం ప్రేమతో గెలిపించుకుని MLA లు గా మంత్రులుగా నిలబెట్టిన ప్రజాప్రతినిధులు జగన్ సేన భయంతోనో, లేకపోతే ఇష్టంతోనైనా తమ తమ విధులను నిర్వర్తించకుండా, అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని స్థంబింపజేస్తుంటే, ప్రబలుతున్న స్వయిన్ ఫ్లూ, పెరుగుతున్న ధరలు, విజ్రుమ్భిస్తున్న నేర ప్రపంచం లోనికి మన రాష్ట్రాన్ని తోసేస్తుంటే, నాకనిపిస్తుంది వీళ్ళసలు మనుషులేనా అని ! వారి స్వార్థ ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడనికేనా వారిని జనం ఎన్నుకుంది ? వారికి ఇష్టంవల్లో, భయం వల్లో కారణం ఏదైనా ఒక వ్యక్తిని నేతగా ఎన్నుకోవాలనుకుంటే ఇదా పద్దతి ? తమ పనులు నిర్వర్తిస్తూ కూడా వారి అధిష్టానంతో సంప్రదింపులు జరుపుకోవచ్చు కదా ? ఇంకా కొన్ని వార్తలు చూస్తే అసహ్యం వేస్తోంది ! నిజంగా గుండె పోటువచ్చి, లేక తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని కాదు కానీ, కొందరు వ్యక్తులు ఎలా చనిపోయినా గానీ , రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక మరణించినట్లు చూపడానికి కొందరు డబ్బులు ఇవ్వడమూ, ఆ కుటుంబాలు అలా చేయడమూ వింటే మనం భూమి మీదే ఉన్నామా అనే అనుమానం తెప్పిస్తోంది !ఇంత జుగుప్సాకరమైన పద్ధతులలో రాజకీయాలు నడపడం అవసరమా? ప్రజా ప్రయోజనాలను పక్కన బెట్టి స్వార్ధ ప్రయోజనాలకోసం ఇంతగా దిగజారిన ఈ నేతలను ఎంత తిట్టినా వారికి సిగ్గు వస్తుందా? వారికి తామూ మనుషులమేనని గుర్తు వస్తుందా? అలాకాకుంటే వారిని గద్దెలెక్కిన్చిన మననే తిట్టుకోవాలి మనం !

నీకీతరాదు ఆగరా...

Monday 7 September 2009

కూలిస్తే సూర్యుడికి రోడ్డు వేస్తాం !

పచ్చదనమూ పరిశుభ్రతా ? అంటే ఏమిటీ?

ఇదివరకు ఇలాగే చేక్కేవారంటగా ?

నాకు అలవాటేలే బాబూ నీ పని చూసుకో !

హమ్మయ్య ఇవ్వాళ తిండికి డోకా లేదు !

ఒలిమ్పిక్కేల్తే బంగారు బిళ్ళలు ఇస్తారంటగా ?

ఇంకెంత వచ్చేసాంగా !

నీకూ నీ వారులేరు, నాకూ నా వారులేరు !

పద ఇంకా చాలా దూరం వెళ్ళాలి !

ఇది రవాణా సమస్యా ?

బాల కృష్ణుని కష్టాలు !

పప్పులేం ఉడకవు !

రాజశేఖరుని నిష్క్రమణ !

Friday 4 September 2009

ఎందఱో వస్తుంటారూ, ఎందఱో వెళ్తూ ఉంటారు కానీ కొందరే చాలాళ్ళు గుర్తుకొస్తూ ఉంటారు ! అలా ఎక్కువ కాలం గుర్తుండే వారిలో మన దివంగత ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర రెడ్డి గారూ చేరిపోయారు !
కాంగ్రెస్ పార్టీకి పునః ఊపిరులు ఊది, మన రాష్ట్రంలోనే కాక కేంద్రంలో కూడా విజయకేతనం ఎగురవేయించి అధికారంలోకి తెచ్చిన మన రాయలసీమ ముద్దుబిడ్డ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ! జనం వారిని ముద్దుగా వై యస్ అని పిలుచుకుంటే, ఓ యస్ అని తను చేయాలనుకున్నది చేసేయడానికి ఎప్పుడూ తయారుగా ఉండేవారు ఆయన !
కూర్చొని ఉన్నప్పుడు విశ్రాంతిగా అస్సలు పనేమీ లేదన్నట్లు కనిపించే ఆయన, కదిలితే ఒక ప్రభంజనంలా ముందుకు దూసుకు వెళ్ళిపోయేవారు ! ఒక నిర్ణయమంటూ తీసుకున్నాక ఇంక హరిహరాదులు అడ్డువచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని చీకాకులు కలిగినా వెనుకడుగేయని ద్రుఢమైన తత్త్వం ఆయనది !
పార్టీ ని బలోపేతం చేయడం కోసం రాష్ట్రమంతా పాదయాత్రలు చేసి ప్రజలందరినీ కలిసి, వారిలో మళ్ళీ కాంగ్రెస్ ను నమ్మవచ్చు అనే ఆశను కలిగించిన శ్రామికుడు ఆయన ! ఎటువంటి పరిస్థితుల లోనైనా ముఖంలో చెరగని చిరునవ్వు ఆయనకు దేవుడిచ్చిన వరం ! ఆయన మొదలు పెట్టిన జలయజ్ఞం లాంటి పధకాలను ఏమాత్రమూ అవినీతికి చోటులేకుండా పూర్తీ చిత్తశుద్ధితో పూర్తీ చేయగలిగితే మన ఆంద్ర ప్రదేశ్ నిజంగా హరితాంధ్రప్రదేశ్ అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు ! కాకపొతే దీనికి మన నదులకు ఎగువనున్న పోరుగురాష్ట్రాలూ, కేంద్రమూ సరైన ప్రణాలికలతో సాయ, సహకారాలను అందించవలిసి ఉంటుంది ! ఆయన మొదలు పెట్టిన పథకాలన్నీ మంచివే కానీ వాటిని అమలు పరిచి, నిర్వహించే వారి చిత్తసుద్ధి లోపాలు, అవినీతి వాటిని ప్రక్కదారి పట్టించగాలవు ! పారదర్సకంగా ఈ పదకాలన్నిటినీ పూర్తీ చేసి ఏవిధమైన విమర్శలకూ తావివ్వకుండా చూడాల్సిన బాధ్యతా రేపు కాబోయే ముఖ్యమంత్రి మీద ఉంది ! కాంగ్రెస్ కి ఉన్నా ముఠా రాజకీయతత్వం మళ్ళీ చెలరేగి రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టకుండా చూడాల్సిన బాధ్యతా కూడా రాబోయే ముఖ్య మంత్రి మీద ఉంది ! అదిరించో, బెదిరించో అన్ని ముఠాల వారినీ ఒక్క త్రాటిని నడిపించిన రాజశేఖర్ రెడ్డి గారిలాంటి నేత కాంగ్రెస్ కి దొరకడమూ కొద్దిగా కష్టమైన పనే !
ప్రస్తుతం కొంతమంది రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడైన జగన్మోహనరెడ్డి గారిని సి యమ చేయాలని తమ వాదనను వినిపించదమూ, దానికి మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడమూ చేస్తున్నారు. జగన్ ఎటువంటి వ్యక్తీ అనేది కాస్సేపు పక్కన పెడితే, ఏమాత్రమూ రాజకీయ జ్ఞానం కానీ, పరిపాలనా దక్షతగానీ లేని రాజకీయ పసికూనను ఇటువంటి క్లిష్ట సమయంలో నేతగా ఎన్నుకోవడం ఎంతవరకూ సమంజసమో కొద్దిగా మనస్సు పెట్టి ఆలోచిస్తే వారికే తెలుస్తుంది !
ఇటు చూస్తే కొందరు అభిమానులు బాధను తట్టుకోలేక ఆత్మాహుతికి పాల్పడుతున్నారు, ఇది ఏమాత్రమూ హర్శనీయమూ, ఆమోదయోగ్యమూ కాని పిరికి చేష్ట. మనకు ఇష్టమైన వారు మనని విడిచి వెళ్ళినప్పుడు భవిత అందకారంగానూ, బ్రతుకు భారంగానూ తోస్తుంది. కానీ ప్రతి వ్యక్తికీ కొంత నిర్ణీత సమయంలోనే తమ తమ కార్యాలను నిర్వర్తించే అవకాసం ఉంటుంది. వారి సమయం అయిపోయిన తరువాత వారింకేవరికోసమూ ఆగరు. వారి ఆత్మీయుల కోసమే ఉండని వారు అన్యులకోసం ఉండగలరా ? ఎవరైనా వారి ఆత్మీయ నేతకు నివాళి ఇవ్వాలంటే ఇలా ఆత్మత్యాగాలు చేసి కాదు వారి అసయసాధనకోసం పాటుపడి వాటిని సాధించడమే సరైనా నివాళి. గుండెను రాయి చేసుకోవాలి బాధలో ఉన్నవాళ్ళందరూ. ఆత్మీయాన్ధకరంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ తమపై ఆధార పడి ఉన్నవారి గురించి ఏమాత్రమూ ఆలోచించకుండా ఉండడం తప్పనే విషయాన్ని చాటాలి ! ధైర్యం కావలసింది ఇబ్బందికర సమాయలలోనే కనీ ఆనందకర సమయాలలో కాదు కదా !
సరి అయిన వ్యక్తిని రాష్ట్రాధినేతగా ఎన్నుకోవడంలో కాంగ్రెస్ సఫలీకృతం అవుతుందనీ, మనకు మంచి దిశా నిర్దేశం చేయగలిగే నేత దొరుకుతారనీ, మన రాష్ట్ర భవిష్యత్తు కు ఎటువంటి ఇబ్బందీ ఉండదనీ ఆశిద్దాం !

శ్రీ రాజశేఖర రెడ్డి గారి ఆత్మకూ, వారితో పాటు సహప్రయానం చేసి అసువులుబాసిన ఆ నలుగురి ఆత్మలకూ, బాధతో, ఉద్రేకంతో తమ కుటుంబాల ధ్యాస మరిచి ఆత్మహత్యలకు పాల్పడిన వారి ఆత్మలకూ శాంతి చేకూరాలనీ, వారి వారి కుటుంబాలకు ఈ దారుణాన్ని ఎదుర్కొనే శక్తి దొరకాలనీ ప్రార్దిద్దాం !



ఆ పూవు !

Friday 28 August 2009

ఆ పూవు !
రేకు రేకునా ఆశలు దాచి..
రంగుల లోకంలోకి ..
త్వరత్వరగా రావాలని..
తన శక్తినంతా ధార పోసి..
విచ్చుకొంది పసిపూవు !

కళ్ళముందు కనపడ్డ..
ప్రకృతిని చూసి నవ్వుకుంది హయిగా..
ఈ అందం రోజూ చూసే భాగ్యం నాదేనని !

తన దగ్గరకి వచ్చిన...
అందగత్తెను చూసి బెట్టు పోయింది..
లోకంలో అదృష్టం తనదేననే గర్వంతో !

గొంతు పిసికి తల పెరుకుతున్న..
పడతిని చూసి వణికిపోయింది..
ఇంత అందగత్తె మనసులో ఇంత కాటిన్యామా అని !

వనిత సౌందర్యాన్నయినా ..
ఇనుమడిస్తానని ఆమె కొప్పునెక్కిన పూవు..
నేల జారిపోయింది వడిలిపోయిన శరీరంతో !

ఆశలన్నీ ఉడిగిపోగా..
మూతపడుతున్న రెప్పల క్రిందినుంచి చూసింది..
తనలో కలిపేసుకుంటున్న ప్రక్రుతి వేపు ఆర్తితో ఆ పూవు !

ఆకలేస్తోందా పోనీ తినేసేయ్ లే !

కూటి కోసం కూలికోసం !

కోయ్ కోయ్ కోతలు కోయ్ !

ఇంటికి రావయ్యా చెప్తా నీ పని !

అమెరికా మాజీ పెద్దలు !

ఛా ! నిజమా ప్రణబ్ జీ ?

Wednesday 12 August 2009


నూట అరవై ఒక్క జిల్లాలలో కరువు పరిస్తితులు !
కంగారు పడకండి దేశ ప్రజలారా, సరిపడినన్ని ఆహార నిల్వలున్నాయి ! ధరలను నియంత్రణలోనే ఉంచుతాం !
ఆహా ! ఆర్ధిక మంత్రిగారు ఎంత గొప్ప మాట సెలవిచ్చారు?
అయ్యా ! మీ ప్రభుత్వ హయాంలోనే ఏవిధమయిన కరువు పరిస్థితులూ లేనప్పుడు ధరలు ఆకాశ మార్గాన పయనించి చుక్కలను దాటుతుంటే ఎందుకు నియంత్రించలేదో ? మరి ఈ కరవు పరిస్థితులలో వాటిని ఎలా నియంత్రిస్తారో? మీకు కొత్తగా ఏమైనా మంత్ర దండం దొరికిందా? లేకపోతె ఇన్నాళ్ళూ కావాలనే నియంత్రించలేదని ఒప్పేసుకుంటూ ఉన్నారా ఏమిటీ కొంపతీసి ?
ఇది మీ అండ దండలతో ధరలు పెంచేసిన వారికి, రాబోయే ' ఇంకా మంచికాలం ' గురించి ఇచ్చే హింటు కాదు కదా?
అదే అయితే ఇంక మేము బతికి బట్ట కట్టినట్టే !

స్వయిన్ ఫ్లూ భూతం ?


ఒక్క రోజులో దేశంలో 9 మరణాలు !
పారిపోతున్న జనం !
ఖాళీ అయిపోతున్న నగరాలు !
ఇదీ మన మీదియా సృష్టిస్తున్నభయ వాతావరణం !
ఒక టీవీ చానల్ ని మించి ఇంకో టీవీ చానల్ పోటీ పడి చేస్తున్న ప్రచారం !
కొన్ని రాజకీయ పక్షాలు తోడై ప్రజల మానసిక పరిస్థితులతో ఆడుతున్న ఆట !

అన్నీ ఇంతేనా అని రోత తెచ్చుకోకుండా కొన్ని చానళ్ళు అప్పుడప్పుడు స్వయిన్ ఫ్లూ పాజిటివ్ గా గుర్తించబడి కాపాదబడిన వారి సంఖ్యను సూచిస్తూ, స్వయిన్ ఫ్లూ బారినపడి బయటపడిన వారితో వారి అనుభవాలను చర్చిస్తూ ఊపిరి పీల్చుకోనిస్తున్నాయి ! స్వయిన్ ఫ్లూ ఇలాంటి పరిస్తితులున్నప్పుడే వస్తుంది, ఒక వేళ తప్పనిసరి పరిస్థితులలో మనం స్వయిన్ ఫ్లూ బాగా ప్రబలిన ప్రాంతాలకు వెళ్ళితే ఇలాంటి జాగ్రత్తలూ తీసుకోవాలి, స్వయిన్ ఫ్లూ వచ్చినప్పుడు ఇలా మనను మనం రక్షించుకోవాలి, అది ఇతరులకు పాకకుండా మనం ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా సజ్ఞాత్మకంగా వివరిస్తూ జనాన్ని జాగారూకం చేయాల్సిన ప్రసార మాధ్యమాలు ఈ విషయంలో చాలాభాగం విఫలమయ్యాయనే చెప్పవచ్చు ! మా మునిసిపల్ కార్పోరేషను ఇంకో అడుగు ముందేసి ఎస్సెమ్మెస్ పోల్ ద్వారా స్కూళ్ళు మూయాలో వద్దో చెప్పమని ప్రజలనే అడిగేసింది !

ఇది నాకు పద్నాలుగు / పదిహేనేళ్ళక్రితం మేము సూరత్ లో ఉన్నప్పుడు వచ్చిన ప్లేగు వ్యాదిని గుర్తు చేసింది !
అప్పుడు ఇన్ని చానళ్ళు లేకపోవడం చేత బ్రతికి పోయాం కానీ, అప్పుడూ అంతే గోరంతలు కొండంతలు చేయబడి, ప్రాణ భయంతో జనం సూరత్ నుంచి వివిధ ప్రాంతాలకు పారిపోయి ఆయా ప్రాంతాల ప్రజలకు కూడా భయాన్ని అంటిన్చేసారు(ప్లేగు అంటక పోయినా) ! ఆలశ్యంగా మేలుకున్న ప్రభుత్వం సూరత్ ను చక్రభందంలో ఉంచి జనం బయటికి పోకుండా చేసి ప్రభలకుండా చేసి భేష్ అనిపించుకుంది ! ఇక్కడ డీవీ రావుగారనే మహానుభావుడు(మునిసిపల్ కమీషనరు) సూరత్ ను చెత్త నగరం నుంచి చెత్తను జాగ్రత్తగా సేకరించే నగరంగా మార్చడంలో పోషించిన పాత్ర చిరస్మరణీయం !

అప్పటి ఆ అనుభవాన్ని చూసినాక కూడా ఇలాంటి మహామారి అంటువ్యాధులు వచ్చినప్పుడు ఏవిధంగా వాటిని ఎదుర్కోవాలో ఒక నిర్దుష్టమైన ప్రణాళిక తయారు చేయడానికి ప్రభుత్వాలకు అడ్డేమిటో తెలియదు !
ఆరోగ్యం కి ఇచ్చే బడ్జట్టు నంతా ఎలా ఖర్చు చేసారని ఎవరూ వైద్యశాఖామాత్యులను అడగకపోయినా ఇటువంటి వెనుకబాటు తనానికి మాత్రం నిలదీయాల్సిందే !

ఒక ప్రాంతంలో అంటువ్యాధులు బాగా వుంటే ఆ ప్రాంతాన్ని రక్షణ వృత్తం (క్వారంటైను) ఉంచి ఇతర ప్రాంతాలకు పాకకుండా చేయాలి ! అది తప్ప అన్నీ జరుగుతున్నాయి ! విదేశాలనుంచి కుప్పలు తెప్పలుగా స్వయిను ఫ్లూ లక్షణాలు ఉన్నవాళ్ళు వస్తుంటే మరి ఆదేశాల విమానాశ్రయాలలో తప్పనిసరిగా అందరి నమూనాలూ సేకరించేలా చేస్తూ, ఆ లక్షణాలు ఉన్నవాళ్ళను పంపనీయకుండా చేయాలని ఎందుకు అనిపించదు? దేశమంతా అభిమానించే మన మాజీ రాష్ట్రపతికి భద్రతపేరుతో అవమానించిన విదేశీ సంస్థలను చూసినా భుద్దిరాదా మన ప్రభుత్వాలకు ?
విదేశాలనుంచి వచ్చేవారికి భద్రతను, ఆరోగ్యాన్నీ పక్కనపెట్టి ఎర్ర తివాచీ పరచాల్సినంత దిక్కు మాలిన పరిస్థితులా మన దేశానికి ? గుడ్డిలో మెల్లలాగా కనీసం మన విమానాశ్రయాలలో నైనా ఈ లక్షణాలు కనిపిస్తున్నవారిని పరీక్షిస్తున్నారు !
మనం ఎందుకు మీమాంస పడుతున్నాం ? ఇటువంటప్పుడు ఇంతమంది అని ఒక సంఖ్య పెట్టుకొని అంతమంది చనిపోయినాక కానీ మనం సరయిన చర్యలు తీసుకోమా?

అందరూ లేవాలి తెల్లారింది !

Monday 10 August 2009

నీ స్నేహమే నేస్తం !

అమ్మో పడిపోతావ్ !

అంతా తింటే చస్తావ్ !

అమ్మాయి కళ్లు

మేమున్నాము కదా !


మిత్రులారా !

ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిత్యం పరుగులు తీస్తూ, మూస జీవితచట్రాలలో ఇరుక్కొని, విసిగి వేసారిపోతున్న మన యువతరం, ఎన్నో మానసిక ఆందోళనలకు లోనవుతోంది. క్షణిక ఆవేశాలలో తీసుకొంటున్న ఆకస్మిక నిర్ణయాల వలన, ఎన్నో కుటుంబాలు విడి పోతున్నాయి, కలహాలతో కస్సుబుస్సులతో జీవితాలు భారమవుతున్నాయి. ఇంకొన్ని జీవితాలు అర్థాంతరంగా అంతమౌతున్నాయి. కొన్నిసార్లు వారి భాదను పంచుకొనే వారుంటే కొన్ని భార హృదయాలు తేలికవుతాయి, కొన్ని సలహాలను వినే స్థాయికి చేరి పరిష్కార మార్గానికి మళ్లుతాయి. అందుకోసమే ఈ ఆర్కుట్ కమ్యూనిటీ స్థాపించాము. మీకొసం మేమున్నామూ అని చెప్పడమే కాక తగిన సలహాలను ఇవ్వడానికి ప్రయత్నిస్తాము ! ఈ కమ్యూనిటీలో ఎవరైనా తమ భాదలను, ఇబ్బందులను, తమ స్వంత పెర్లతోనైనా, ఇతర పెర్లతోనైనా, లేక పేరులేకుండానైనా పోస్ట్ చేసయొచ్చు, అలా వచ్చిన వాటికీ సభ్య కౌన్సిలర్లు కానీ, సంబందిత విషయాలలో అనుభవమున్న కౌన్సిలర్లు కానీ, సలహాలు ఇస్తారు, అవసరమైతే ఫోను ద్వారా మాట్లాడొచ్హు, వీలయితే ఈ విషయాలలో సహాయం చేసే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల లింకులు ఇచ్చి, వారి సాయం కొసం ప్రయత్నిస్తాం. మీ అందరి నుంచి ఆ కమ్యూనిటీపై సలహాలు కోరుతున్నాము !

ఇది కమ్యూనిటీ లింక్ : http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=92872790

చిరిగిన స్వాతంత్ర్యపు చీర !

Saturday 8 August 2009

1947 లో భరతమాతకు..
కట్టిన స్వాతంత్ర్యపు చీర,..
రంగు వెలిసి.. చిరుగుపట్టి..
వెలవెలా.. పోతోంది !

నిజమైన నాయకులు తటస్థులవగా..
నకిలీ నాయకుల దోపిడీకి..
పిగిలి.. చిరిగి పోయింది చీర !

నిస్వార్ధపరులు తప్పుకోగా..
స్వార్ధపరుల కబళింపుకు..
నలిగి.. చిరిగి పోయింది చీర !

చట్టం పట్టు విడవగా..
నేరస్తుల పాశవికానికి..
చివికి ... చిరిగి పోయింది చీర !

న్యాయం నిద్రపోగా...
అవినీతిపరుల దౌర్జన్యానికి..
వెలిసి.. చిరిగి పోయింది చీర !

నాయకులు వినాయకులు కాగా..
వ్యర్ధ ప్రజల రక్షణలో..
చిరిగి..చిరిగి పోయింది చీర !

1947 లో భరతమాతకు..
కట్టిన స్వాతంత్ర్యపు చీర,..
రంగు వెలిసి.. చిరుగుపట్టి..
వెలవెలా... పోతోంది !

రాఖీ శుభాకాంక్షలు !

Wednesday 5 August 2009


రాఖీ చేతికి కట్టినా కట్టకున్నా ఆ సోదరభావంతోనే మనం మెలగాలి ! ఆత్మీయతలే పంచాలి !
స్వార్ధానికీ, కర్కశత్వానికీ దూరమై చల్లగా లోకం వుండాలి ! ఎ చెల్లి కంట కన్నీరైనా ప్రతి అన్నను కరిగించాలి ! సోదరి రక్షకై సోదరుడు ఎప్పుడూ ముందడుగు వేస్తూ వుండాలి ! దారం కాదు కట్టేది అది ఒక బాస అని మరవకుండాలి! పరాయి స్త్రీలో సోదరినీ, పర పురుషునిలో సోదరుని కాన్చేలా యువతరం మారాలి !

మిత్రులందరికీ రక్షా బందన శుభాకాంక్షలు !

సమాజంలో స్వేచ్చగా బతకనీయండి !

Tuesday 4 August 2009

ఇది ఒక స్త్రీ హృదయం !
నేటి సమాజంలో ఆక్రోశిస్తూ ఆవిరవుతున్న ఎందఱో స్త్రీమూర్తుల ప్రతినిధిగా చెబుతోంది !
ఎవరైనా ఏదయినా బాగుచేయలేనప్పుడు పాడుచేసే హక్కు ఎలా వుంటుంది !
ప్రేమ అడిగితె ఇచ్చే బిక్షకాదు !
ప్రేమికులెప్పుడూ మేలుకోరాలి కానీ నరకడం చంపడం వంటి కిరాతకపు చర్యలకు పాల్పడకూడదు !
నిజంగా ప్రేమిస్తే ద్వేషించకూడదు కదా?
పరాయి స్త్రీలో సోదరిని చూడలేని దౌర్భాగ్య పరిస్తితిలోంచి యువత బయటకు రావాలి !
సమాజంలో సగభాగామైన వారి జీవిత నిర్ణయాలు వారినే తీసుకోనీయండి !
సోదర భావానికి అర్ధంలా నిలవండి !