హైదరా 'బాధ' బాటచారులు !

Tuesday 22 September 2009

మన భాగ్య నగరంలో ప్రజలు కాలి నడకన వెళ్ళాలి అంటే అది ఒక నరకమే !రోడు మీద ఎటువైపు నుంచి ఎ వాహనం వస్తుందో తెలీదు ! రోడ్డుకు కుడి చేతి పక్కగా నడుద్దాం అంటే బస్సు స్టాప్ లూ , దాని దగ్గరకు పోలేనంతగా ఆటోలు, తోపుడు బళ్ళూ , పైగా రాంగ్ రూటులో ఎదురొచ్చే సైకిళ్ళూ , స్కూటర్లూ, ఆటో లూ , అప్పుడప్పుడు కార్లూ, లారీలూ కూడా ! ఏయ్ నీకేమైనా పిచ్చా ఫుట్పాత్ మీద నడవకుండా రోడ్డుమీద నడుస్తూ అవడ్డూ, ఇవడ్డూ అంటావే అంటున్నారా ? అయితే మీది హైదరా ' బాధ ' కాదు ! మన మున్సిపాలిటీ పెద్దలు పాపం రోడ్లు వెడల్పు చేస్తారు కానీ ఫుట్పాత్ పెట్టడం మరిచిపోతారు, లేకపోతే పేరుకి బుల్లి గా ఉంచుతారు ! పొరపాటున ఫుట్పాత్ ఉందీ అంటే దాని మీద ట్రాన్స్ ఫార్మర్లు , చెట్లూ వాటి చుట్టూతా కంచెలూ, చెత్త కుప్పలూ, బట్టబయటి సులబ్ లూ !మనకి అవిలేని ప్రదేశం కనిపించిందీ అంటే చక్కగా పూర్తి ఫుట్పాత్ మీద చక్కగా డిస్ప్లే చేస్తూ పళ్ళూ, ఇంకా నానా చెత్తా అమ్మేవాళ్ళు ! ఇంకా విరిగి పోయి పడబోతున్న స్తంబాలూ,తెగిపోయి వేలాడుతున్న తీగెలూ ఇలా వీటన్నిటినీ దాటుకుంటూ గమ్యాన్ని చేరడం అంటే పద్మవ్యూహంలో అడుగు పెట్టినట్లే ! మరి మున్సిపాలిటీ లో పెద్దలు బతికేదీ ఇదే నగరమైన పాపం వాళ్ళు ఈ చెత్త రోడ్లమీద నడవరనుకుంటా ! వాళ్ళు సరే పోలీసులెం చేస్తున్నారూ అంటారా ? భలేవారే మీరు ఇవన్నీ వాళ్ళ ఆదాయ మార్గాలు ! రోజూ బంగారు గుడ్లు పెట్టే బాతులు ! వాళ్ళు ఎలా పట్టించుకుంటారు? ఇంక మనం నోరు తెరిచి అడగాలంటే గూండాలు తయారు మన భరతం పట్టడానికి ! ఎవరిని ఎంత తిట్టి లాభం ఏమిటి ? స్వలాభం తప్ప ఇతరుల పని పట్టని పాలకులనూ, అధికారులనూ, ప్రజలనూ ఎలా తిట్టాలో మీరే చెప్పండి !

వీళ్ళనేనా మనం ఎన్నుకుంది ?

మనం ప్రేమతో గెలిపించుకుని MLA లు గా మంత్రులుగా నిలబెట్టిన ప్రజాప్రతినిధులు జగన్ సేన భయంతోనో, లేకపోతే ఇష్టంతోనైనా తమ తమ విధులను నిర్వర్తించకుండా, అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని స్థంబింపజేస్తుంటే, ప్రబలుతున్న స్వయిన్ ఫ్లూ, పెరుగుతున్న ధరలు, విజ్రుమ్భిస్తున్న నేర ప్రపంచం లోనికి మన రాష్ట్రాన్ని తోసేస్తుంటే, నాకనిపిస్తుంది వీళ్ళసలు మనుషులేనా అని ! వారి స్వార్థ ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడనికేనా వారిని జనం ఎన్నుకుంది ? వారికి ఇష్టంవల్లో, భయం వల్లో కారణం ఏదైనా ఒక వ్యక్తిని నేతగా ఎన్నుకోవాలనుకుంటే ఇదా పద్దతి ? తమ పనులు నిర్వర్తిస్తూ కూడా వారి అధిష్టానంతో సంప్రదింపులు జరుపుకోవచ్చు కదా ? ఇంకా కొన్ని వార్తలు చూస్తే అసహ్యం వేస్తోంది ! నిజంగా గుండె పోటువచ్చి, లేక తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని కాదు కానీ, కొందరు వ్యక్తులు ఎలా చనిపోయినా గానీ , రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక మరణించినట్లు చూపడానికి కొందరు డబ్బులు ఇవ్వడమూ, ఆ కుటుంబాలు అలా చేయడమూ వింటే మనం భూమి మీదే ఉన్నామా అనే అనుమానం తెప్పిస్తోంది !ఇంత జుగుప్సాకరమైన పద్ధతులలో రాజకీయాలు నడపడం అవసరమా? ప్రజా ప్రయోజనాలను పక్కన బెట్టి స్వార్ధ ప్రయోజనాలకోసం ఇంతగా దిగజారిన ఈ నేతలను ఎంత తిట్టినా వారికి సిగ్గు వస్తుందా? వారికి తామూ మనుషులమేనని గుర్తు వస్తుందా? అలాకాకుంటే వారిని గద్దెలెక్కిన్చిన మననే తిట్టుకోవాలి మనం !

కేకు కోసే టైముకి వచ్చేస్తాను అన్నాగా ?

Friday 11 September 2009

నీకీతరాదు ఆగరా...

Monday 7 September 2009

కూలిస్తే సూర్యుడికి రోడ్డు వేస్తాం !

పచ్చదనమూ పరిశుభ్రతా ? అంటే ఏమిటీ?

ఇదివరకు ఇలాగే చేక్కేవారంటగా ?

నాకు అలవాటేలే బాబూ నీ పని చూసుకో !

హమ్మయ్య ఇవ్వాళ తిండికి డోకా లేదు !

ఒలిమ్పిక్కేల్తే బంగారు బిళ్ళలు ఇస్తారంటగా ?

ఇంకెంత వచ్చేసాంగా !

నీకూ నీ వారులేరు, నాకూ నా వారులేరు !

పద ఇంకా చాలా దూరం వెళ్ళాలి !

ఇది రవాణా సమస్యా ?

బాల కృష్ణుని కష్టాలు !

పప్పులేం ఉడకవు !

రాజశేఖరుని నిష్క్రమణ !

Friday 4 September 2009

ఎందఱో వస్తుంటారూ, ఎందఱో వెళ్తూ ఉంటారు కానీ కొందరే చాలాళ్ళు గుర్తుకొస్తూ ఉంటారు ! అలా ఎక్కువ కాలం గుర్తుండే వారిలో మన దివంగత ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర రెడ్డి గారూ చేరిపోయారు !
కాంగ్రెస్ పార్టీకి పునః ఊపిరులు ఊది, మన రాష్ట్రంలోనే కాక కేంద్రంలో కూడా విజయకేతనం ఎగురవేయించి అధికారంలోకి తెచ్చిన మన రాయలసీమ ముద్దుబిడ్డ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ! జనం వారిని ముద్దుగా వై యస్ అని పిలుచుకుంటే, ఓ యస్ అని తను చేయాలనుకున్నది చేసేయడానికి ఎప్పుడూ తయారుగా ఉండేవారు ఆయన !
కూర్చొని ఉన్నప్పుడు విశ్రాంతిగా అస్సలు పనేమీ లేదన్నట్లు కనిపించే ఆయన, కదిలితే ఒక ప్రభంజనంలా ముందుకు దూసుకు వెళ్ళిపోయేవారు ! ఒక నిర్ణయమంటూ తీసుకున్నాక ఇంక హరిహరాదులు అడ్డువచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని చీకాకులు కలిగినా వెనుకడుగేయని ద్రుఢమైన తత్త్వం ఆయనది !
పార్టీ ని బలోపేతం చేయడం కోసం రాష్ట్రమంతా పాదయాత్రలు చేసి ప్రజలందరినీ కలిసి, వారిలో మళ్ళీ కాంగ్రెస్ ను నమ్మవచ్చు అనే ఆశను కలిగించిన శ్రామికుడు ఆయన ! ఎటువంటి పరిస్థితుల లోనైనా ముఖంలో చెరగని చిరునవ్వు ఆయనకు దేవుడిచ్చిన వరం ! ఆయన మొదలు పెట్టిన జలయజ్ఞం లాంటి పధకాలను ఏమాత్రమూ అవినీతికి చోటులేకుండా పూర్తీ చిత్తశుద్ధితో పూర్తీ చేయగలిగితే మన ఆంద్ర ప్రదేశ్ నిజంగా హరితాంధ్రప్రదేశ్ అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు ! కాకపొతే దీనికి మన నదులకు ఎగువనున్న పోరుగురాష్ట్రాలూ, కేంద్రమూ సరైన ప్రణాలికలతో సాయ, సహకారాలను అందించవలిసి ఉంటుంది ! ఆయన మొదలు పెట్టిన పథకాలన్నీ మంచివే కానీ వాటిని అమలు పరిచి, నిర్వహించే వారి చిత్తసుద్ధి లోపాలు, అవినీతి వాటిని ప్రక్కదారి పట్టించగాలవు ! పారదర్సకంగా ఈ పదకాలన్నిటినీ పూర్తీ చేసి ఏవిధమైన విమర్శలకూ తావివ్వకుండా చూడాల్సిన బాధ్యతా రేపు కాబోయే ముఖ్యమంత్రి మీద ఉంది ! కాంగ్రెస్ కి ఉన్నా ముఠా రాజకీయతత్వం మళ్ళీ చెలరేగి రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టకుండా చూడాల్సిన బాధ్యతా కూడా రాబోయే ముఖ్య మంత్రి మీద ఉంది ! అదిరించో, బెదిరించో అన్ని ముఠాల వారినీ ఒక్క త్రాటిని నడిపించిన రాజశేఖర్ రెడ్డి గారిలాంటి నేత కాంగ్రెస్ కి దొరకడమూ కొద్దిగా కష్టమైన పనే !
ప్రస్తుతం కొంతమంది రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడైన జగన్మోహనరెడ్డి గారిని సి యమ చేయాలని తమ వాదనను వినిపించదమూ, దానికి మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడమూ చేస్తున్నారు. జగన్ ఎటువంటి వ్యక్తీ అనేది కాస్సేపు పక్కన పెడితే, ఏమాత్రమూ రాజకీయ జ్ఞానం కానీ, పరిపాలనా దక్షతగానీ లేని రాజకీయ పసికూనను ఇటువంటి క్లిష్ట సమయంలో నేతగా ఎన్నుకోవడం ఎంతవరకూ సమంజసమో కొద్దిగా మనస్సు పెట్టి ఆలోచిస్తే వారికే తెలుస్తుంది !
ఇటు చూస్తే కొందరు అభిమానులు బాధను తట్టుకోలేక ఆత్మాహుతికి పాల్పడుతున్నారు, ఇది ఏమాత్రమూ హర్శనీయమూ, ఆమోదయోగ్యమూ కాని పిరికి చేష్ట. మనకు ఇష్టమైన వారు మనని విడిచి వెళ్ళినప్పుడు భవిత అందకారంగానూ, బ్రతుకు భారంగానూ తోస్తుంది. కానీ ప్రతి వ్యక్తికీ కొంత నిర్ణీత సమయంలోనే తమ తమ కార్యాలను నిర్వర్తించే అవకాసం ఉంటుంది. వారి సమయం అయిపోయిన తరువాత వారింకేవరికోసమూ ఆగరు. వారి ఆత్మీయుల కోసమే ఉండని వారు అన్యులకోసం ఉండగలరా ? ఎవరైనా వారి ఆత్మీయ నేతకు నివాళి ఇవ్వాలంటే ఇలా ఆత్మత్యాగాలు చేసి కాదు వారి అసయసాధనకోసం పాటుపడి వాటిని సాధించడమే సరైనా నివాళి. గుండెను రాయి చేసుకోవాలి బాధలో ఉన్నవాళ్ళందరూ. ఆత్మీయాన్ధకరంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ తమపై ఆధార పడి ఉన్నవారి గురించి ఏమాత్రమూ ఆలోచించకుండా ఉండడం తప్పనే విషయాన్ని చాటాలి ! ధైర్యం కావలసింది ఇబ్బందికర సమాయలలోనే కనీ ఆనందకర సమయాలలో కాదు కదా !
సరి అయిన వ్యక్తిని రాష్ట్రాధినేతగా ఎన్నుకోవడంలో కాంగ్రెస్ సఫలీకృతం అవుతుందనీ, మనకు మంచి దిశా నిర్దేశం చేయగలిగే నేత దొరుకుతారనీ, మన రాష్ట్ర భవిష్యత్తు కు ఎటువంటి ఇబ్బందీ ఉండదనీ ఆశిద్దాం !

శ్రీ రాజశేఖర రెడ్డి గారి ఆత్మకూ, వారితో పాటు సహప్రయానం చేసి అసువులుబాసిన ఆ నలుగురి ఆత్మలకూ, బాధతో, ఉద్రేకంతో తమ కుటుంబాల ధ్యాస మరిచి ఆత్మహత్యలకు పాల్పడిన వారి ఆత్మలకూ శాంతి చేకూరాలనీ, వారి వారి కుటుంబాలకు ఈ దారుణాన్ని ఎదుర్కొనే శక్తి దొరకాలనీ ప్రార్దిద్దాం !