రాజశేఖరుని నిష్క్రమణ !

Friday 4 September 2009

ఎందఱో వస్తుంటారూ, ఎందఱో వెళ్తూ ఉంటారు కానీ కొందరే చాలాళ్ళు గుర్తుకొస్తూ ఉంటారు ! అలా ఎక్కువ కాలం గుర్తుండే వారిలో మన దివంగత ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర రెడ్డి గారూ చేరిపోయారు !
కాంగ్రెస్ పార్టీకి పునః ఊపిరులు ఊది, మన రాష్ట్రంలోనే కాక కేంద్రంలో కూడా విజయకేతనం ఎగురవేయించి అధికారంలోకి తెచ్చిన మన రాయలసీమ ముద్దుబిడ్డ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ! జనం వారిని ముద్దుగా వై యస్ అని పిలుచుకుంటే, ఓ యస్ అని తను చేయాలనుకున్నది చేసేయడానికి ఎప్పుడూ తయారుగా ఉండేవారు ఆయన !
కూర్చొని ఉన్నప్పుడు విశ్రాంతిగా అస్సలు పనేమీ లేదన్నట్లు కనిపించే ఆయన, కదిలితే ఒక ప్రభంజనంలా ముందుకు దూసుకు వెళ్ళిపోయేవారు ! ఒక నిర్ణయమంటూ తీసుకున్నాక ఇంక హరిహరాదులు అడ్డువచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని చీకాకులు కలిగినా వెనుకడుగేయని ద్రుఢమైన తత్త్వం ఆయనది !
పార్టీ ని బలోపేతం చేయడం కోసం రాష్ట్రమంతా పాదయాత్రలు చేసి ప్రజలందరినీ కలిసి, వారిలో మళ్ళీ కాంగ్రెస్ ను నమ్మవచ్చు అనే ఆశను కలిగించిన శ్రామికుడు ఆయన ! ఎటువంటి పరిస్థితుల లోనైనా ముఖంలో చెరగని చిరునవ్వు ఆయనకు దేవుడిచ్చిన వరం ! ఆయన మొదలు పెట్టిన జలయజ్ఞం లాంటి పధకాలను ఏమాత్రమూ అవినీతికి చోటులేకుండా పూర్తీ చిత్తశుద్ధితో పూర్తీ చేయగలిగితే మన ఆంద్ర ప్రదేశ్ నిజంగా హరితాంధ్రప్రదేశ్ అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు ! కాకపొతే దీనికి మన నదులకు ఎగువనున్న పోరుగురాష్ట్రాలూ, కేంద్రమూ సరైన ప్రణాలికలతో సాయ, సహకారాలను అందించవలిసి ఉంటుంది ! ఆయన మొదలు పెట్టిన పథకాలన్నీ మంచివే కానీ వాటిని అమలు పరిచి, నిర్వహించే వారి చిత్తసుద్ధి లోపాలు, అవినీతి వాటిని ప్రక్కదారి పట్టించగాలవు ! పారదర్సకంగా ఈ పదకాలన్నిటినీ పూర్తీ చేసి ఏవిధమైన విమర్శలకూ తావివ్వకుండా చూడాల్సిన బాధ్యతా రేపు కాబోయే ముఖ్యమంత్రి మీద ఉంది ! కాంగ్రెస్ కి ఉన్నా ముఠా రాజకీయతత్వం మళ్ళీ చెలరేగి రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టకుండా చూడాల్సిన బాధ్యతా కూడా రాబోయే ముఖ్య మంత్రి మీద ఉంది ! అదిరించో, బెదిరించో అన్ని ముఠాల వారినీ ఒక్క త్రాటిని నడిపించిన రాజశేఖర్ రెడ్డి గారిలాంటి నేత కాంగ్రెస్ కి దొరకడమూ కొద్దిగా కష్టమైన పనే !
ప్రస్తుతం కొంతమంది రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడైన జగన్మోహనరెడ్డి గారిని సి యమ చేయాలని తమ వాదనను వినిపించదమూ, దానికి మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడమూ చేస్తున్నారు. జగన్ ఎటువంటి వ్యక్తీ అనేది కాస్సేపు పక్కన పెడితే, ఏమాత్రమూ రాజకీయ జ్ఞానం కానీ, పరిపాలనా దక్షతగానీ లేని రాజకీయ పసికూనను ఇటువంటి క్లిష్ట సమయంలో నేతగా ఎన్నుకోవడం ఎంతవరకూ సమంజసమో కొద్దిగా మనస్సు పెట్టి ఆలోచిస్తే వారికే తెలుస్తుంది !
ఇటు చూస్తే కొందరు అభిమానులు బాధను తట్టుకోలేక ఆత్మాహుతికి పాల్పడుతున్నారు, ఇది ఏమాత్రమూ హర్శనీయమూ, ఆమోదయోగ్యమూ కాని పిరికి చేష్ట. మనకు ఇష్టమైన వారు మనని విడిచి వెళ్ళినప్పుడు భవిత అందకారంగానూ, బ్రతుకు భారంగానూ తోస్తుంది. కానీ ప్రతి వ్యక్తికీ కొంత నిర్ణీత సమయంలోనే తమ తమ కార్యాలను నిర్వర్తించే అవకాసం ఉంటుంది. వారి సమయం అయిపోయిన తరువాత వారింకేవరికోసమూ ఆగరు. వారి ఆత్మీయుల కోసమే ఉండని వారు అన్యులకోసం ఉండగలరా ? ఎవరైనా వారి ఆత్మీయ నేతకు నివాళి ఇవ్వాలంటే ఇలా ఆత్మత్యాగాలు చేసి కాదు వారి అసయసాధనకోసం పాటుపడి వాటిని సాధించడమే సరైనా నివాళి. గుండెను రాయి చేసుకోవాలి బాధలో ఉన్నవాళ్ళందరూ. ఆత్మీయాన్ధకరంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ తమపై ఆధార పడి ఉన్నవారి గురించి ఏమాత్రమూ ఆలోచించకుండా ఉండడం తప్పనే విషయాన్ని చాటాలి ! ధైర్యం కావలసింది ఇబ్బందికర సమాయలలోనే కనీ ఆనందకర సమయాలలో కాదు కదా !
సరి అయిన వ్యక్తిని రాష్ట్రాధినేతగా ఎన్నుకోవడంలో కాంగ్రెస్ సఫలీకృతం అవుతుందనీ, మనకు మంచి దిశా నిర్దేశం చేయగలిగే నేత దొరుకుతారనీ, మన రాష్ట్ర భవిష్యత్తు కు ఎటువంటి ఇబ్బందీ ఉండదనీ ఆశిద్దాం !

శ్రీ రాజశేఖర రెడ్డి గారి ఆత్మకూ, వారితో పాటు సహప్రయానం చేసి అసువులుబాసిన ఆ నలుగురి ఆత్మలకూ, బాధతో, ఉద్రేకంతో తమ కుటుంబాల ధ్యాస మరిచి ఆత్మహత్యలకు పాల్పడిన వారి ఆత్మలకూ శాంతి చేకూరాలనీ, వారి వారి కుటుంబాలకు ఈ దారుణాన్ని ఎదుర్కొనే శక్తి దొరకాలనీ ప్రార్దిద్దాం !



0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )